PF:పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీకు రూ.7 లక్షల బీమా ఫ్రీ అని తెలుసా?
PF: ఎప్పుడైతే మీ పీఎఫ్ ఖాతా ఓపెన్ అవుతుందో, అప్పుడే మీరు ఆటోమేటిక్గా ఈ ఇన్సూరెన్స్ పథకంలో చేరిపోతారు.
PF
గవర్నమెంట్ లేదా ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగి శాలరీ నుంచి ప్రతి నెలా కొంత మొత్తం పీఎఫ్(PF) రూపంలో కట్ అవుతూ ఉంటుంది. దీనిని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకునే పొదుపుగా చాలామంది అనుకుంటారు. కానీ పీఎఫ్(PF) ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగికి కూడా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద ఏడు లక్షల రూపాయల వరకు ఫ్రీ బీమా సౌకర్యం ఉంటుందనే ‘హిడెన్ బెనిఫిట్’ గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు.
ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దీని కోసం ఉద్యోగి ఒక్క పైసా కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ ప్రీమియం మొత్తాన్ని ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ కానీ యజమాని కానీ మాత్రమే భరిస్తారు. ఎప్పుడైతే మీ పీఎఫ్ ఖాతా ఓపెన్ అవుతుందో, అప్పుడే మీరు ఆటోమేటిక్గా ఈ ఇన్సూరెన్స్ పథకంలో చేరిపోతారు. దీని కోసం విడిగా ఎటువంటి దరఖాస్తు చేయాల్సిన అవసరం కూడా ఉండదు.
ఈ బీమా మొత్తం ఎలా లెక్కించబడుతుందన్న విషయాన్ని ప్రతి ఉద్యోగి తెలుసుకోవాలి. దీనిని ఉద్యోగి పన్నెండు నెలల బేసిక్ జీతం , డియర్నెస్ అలవెన్స్ (DA) ఆధారంగా నిర్ణయిస్తారు. సాధారణంగా ఆ ఉద్యోగి సగటు జీతం కంటే 35 రెట్లు ఎక్కువ మొత్తాన్ని బీమాగా ఇస్తుంటారు. అంతేకాదు దీనికి అదనంగా మరో రూ.1.75 లక్షల బోనస్ కూడా కలుస్తుంది.
ఉదాహరణకు ఒక ఉద్యోగి గరిష్ట జీత పరిమితి రూ.15 వేలు అని అనుకుంటే, దానికి 35 రెట్లు అంటే రూ.5.25 లక్షలు అవుతుంది. దీనికి బోనస్ మొత్తాన్ని కూడా కలిపితే మొత్తం 7 లక్షల రూపాయలు వస్తుంది. ఉద్యోగంలో ఉన్న సమయంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి ఉద్యోగి మరణిస్తే, వారి కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ గరిష్ట పరిమితిని అందరికీ రూ. ఏడు లక్షలుగా నిర్ణయం తీసుకుంది.

ఒకవేళ క్లెయిమ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే, ఆ ప్రాసెస్ ఇప్పుడు చాలా ఈజీగా మారింది. పీఎఫ్ ఖాతాదారుడు మరణించినప్పుడు వారి నామినీ లేదా చట్టపరమైన వారసులు ఈ డబ్బును క్లెయిమ్ చేయొచ్చు. దీని కోసం నామినీ ఈడీఎల్ఐ ఫారం 5- IF పూర్తి చేసి, ఆ ఉద్యోగి డెత్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు , బ్యాంక్ వివరాలతో ఈపీఎఫ్ఓ ఆఫీసులో సమర్పించాలి.
దరఖాస్తు చేసిన ముప్పై రోజుల్లోపే వీరికి సెటిల్మెంట్ చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. ఒకవేళ ఆ టైమ్లోగా క్లెయిమ్ రాకపోతే, సదరు నామినీకి ఈపీఎఫ్ఓ 12 శాతం వడ్డీతో కలిపి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ప్రతి ఉద్యోగి తన పీఎఫ్ అకౌంట్లో ఇ-నామినేషన్ను పూర్తి చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల ఆపద కాలంలో మీ కుటుంబ సభ్యులు పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇది ప్రతి ఉద్యోగికి హక్కుగా లభించే ప్రయోజనం కాబట్టి, ప్రతి ఒక్కరూ ఈ విషయంపైన అవగాహన కలిగి ఉండాలి.



