T20 World Cup : ఇంగ్లాండ్ బతికిపోయింది..ఓడినా వణికించిన నేపాల్
T20 World Cup : నేపాల్ రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను దాదాపు ఓడించినంత పనిచేసింది. తమ మీద అంచనాలు లేకపోవడంతో దూకుడే మంత్రంగా ఆడిన నేపాల్ బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
T20 World Cup
టీ ట్వంటీ ప్రపంచకప్(T20 World Cup) లో తొలి సంచలనం కొద్దిలో తప్పిపోయింది. పసికూన అనుకుంటే కసికూనలో రెచ్చిపోయి ఆడిన నేపాల్ రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను దాదాపు ఓడించినంత పనిచేసింది. తమ మీద అంచనాలు లేకపోవడంతో దూకుడే మంత్రంగా ఆడిన నేపాల్ బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
వరల్డ్ క్రికెట్ లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరున్న జోఫ్రా ఆర్చర్ ను నేపాల్ బ్యాటర్లు ఉతికారేశారు. ఏదో గల్లీ బౌలర్ ను బాదినట్టుగా ఆర్టర్ బౌలింగ్ లో సిక్సర్లు బాదేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మ్యాచ్ లో ఓడినా నేపాల్ ఇంగ్లీష్ టీమ్ ను వణికించింది. చివరి ఓవర్లో సామ్ కరన్ ఇంగ్లాండ్ ను గట్టెక్కించాడు. లేకుంటే నేపాల్ సంచలనం సృష్టించి ఉండేది. వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో నేపాల్ పై గెలిచి బతికిపోయింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ కు నేపాల్ బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. 57 పరుగులకే ముగ్గురు కీలక బ్యాటర్లను పెవిలియన్ కు పంపించారు. ఫిల్ సాల్ట్ (1), బాంటన్ (2), బట్లర్ (26) పరుగులకే ఔటయ్యారు. ఈ దశలో జాకబ్ బెథల్ , హ్యారీ బ్రూక్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు. నాలుగో వికెట్ కు 71 పరుగులు జోడించారు. బెథల్ 55, బ్రూక్ 53 పరుగులకు ఔటైన తర్వాత చివర్లో విల్ జాక్స్ మెరుపులు మెరిపించాడు. కేవలం 18 బంతుల్లోనే 4 సిక్సర్లు, 1 ఫోర్ తో 39 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ 2, నందన్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.
ఛేజింగ్ లో నేపాల్ కూడా ధీటుగా బదులిచ్చింది. పెద్దగా అంచనాలు లేకపోవడంతో ఫియర్ లెస్ క్రికెట్ ఆడింది. పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయినా కూడా 42 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత మరింత దూకుడుగా ఆడింది. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన కెప్టెన్ రోహిత్ పాడెల్, దీపేంద్ర సింగ్ రెచ్చిపోయారు. వీరిద్దరూ 54 బంతుల్లోనే 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

వీరిద్దరూ క్రీజులో ఉండగా.. విజయం కోసం 36 బంతుల్లో 62 పరుగులు చేయాల్సి ఉండగా మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే సామ్ కరన్ 15వ ఓవర్ లో దీపేంద్రసింగ్ 44( 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులకు ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్లో రోహిత్ కూడా వెనుదిరగడంతో ఇంగ్లాండ్ ఊపిరి పీల్చుకుంది. కానీ నేపాల్ అంత తేలిగ్గా మ్యాచ్ ను వదల్లేదు.
లోకేశ్ బమ్ భారీ షాట్లతో రెచ్చిపోయాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 రన్స్ చేశాడు. ఆర్చర్ వేసిన ఓవర్లో 22 రన్స్ , ల్యూక్ వుడ్ ఓవర్లో 14 పరుగులు రావడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా సామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేసాడు. కేవలం 5 పరుగులే ఇచ్చి ఇంగ్లాండ్ ను గట్టెక్కించాడు. దీంతో నేపాల్ 180 పరుగులే చేయగలిగింది.



