1st Test: సఫారీ ఛాలెంజ్ కు భారత్ రెడీ.. ఈడెన్ లో ముమ్మరంగా ప్రాక్టీస్
1st Test: ఇటీవల వెస్టిండీస్ తో ఆడిన జట్టునే దాదాపుగా సౌతాఫ్రికా సిరీస్ కూ కొనసాగించారు. గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ రావడం ఇండియా బలాన్ని పెంచేదే.
1st Test
భారత జట్టు ఇప్పుడు సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. శుక్రవారం నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్ట్ (1st Test)మొదలుకాబోతోంది. ఇప్పటికే భారత క్రికెటర్లు నెట్ ప్రాక్టీస్ లో బిజిబిజీగా ఉన్నారు. సిరీస్ లో శుభారంభం చేయాలని భావిస్తున్న టీమిండియా నెట్స్ లో చెమటోడుస్తోంది. వరల్డ్ టెస్ట్(Test) చాంపియన్ షిప్ లో భారత్ ఆడుతున్న మూడో సిరీస్ ఇది. తొలి సిరీస్ లో ఇంగ్లాండ్ 5 టెస్టులు ఆడిన టీమిండియా 2-2తో సమం చేసింది. తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్ తో సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 7 టెస్టులు ఆడి 4 విజయాలు, 2 ఓటములు, 1 డ్రాతో 61.90 విజయశాతంతో మూడో ప్లేస్ లో నిలిచింది. మరోవైపు సౌతాఫ్రికా నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ టూర్ కు ముందు పాక్ వెళ్ళిన సఫారీలు 2 టెస్టుల సిరీస్ ను 1-1తో సమంగా ముగించారు. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ప్రస్తుత సిరీస్ కీలకం కానుంది. సౌతాఫ్రికాపై భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేస్తే అగ్రస్థానానికి చేరువయ్యే అవకాశముంది.
ఇటీవల వెస్టిండీస్ తో ఆడిన జట్టునే దాదాపుగా సౌతాఫ్రికా సిరీస్ కూ కొనసాగించారు. గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ రావడం ఇండియా బలాన్ని పెంచేదే. బ్యాటింగ్ లో జైస్వాల్, జురెల్, గిల్ విండీస్ పైనా రాణించారు. ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్ లో జైస్వాల్ తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఆల్ రౌండర్లు జడేజా, నితీశ్ కుమార్ రెడ్డిపైనా అంచనాలున్నాయి.

పేసర్లు బుమ్రా, సిరాజ్ , ఆకాశ్ దీప్ సఫారీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం ఖాయం. ఎప్పటిలానే భారత్ పిచ్ లపై కులీప్, వాషింగ్టన్ నుందర్, అక్షర్ తమ మ్యాజిక్ చూపిస్తే నఫారీలకు చెక్ పెట్టొచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం డబ్ల్యూటీసీ చాంపియన్స్ గా ఉన్న సౌతాఫ్రికాను తేలిగ్గా తీసుకోలేం. ఎందుకంటే పాక్ తో తొలి టెస్టులో ఓడినప్పటకీ రెండో టెస్టులో గెలిచి సిరీస్ ను సమం చేసింది.
టెంబా బవుమా సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు యువ, సీనియర్ ప్లేయర్స్ తో పటిష్టంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయమని అంచనా వేస్తున్నారు. తొలి టెస్టుకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ టాస్ కోసం ప్రత్యేక కాయిన్ తయారు చేయించింది. ఈ గోల్డ్ కాయిన్ లో ఒకవైపు మహాత్మా గాంధీ, మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మనం డేలా చిత్రాలు ముద్రించారు.



