Womens Team India : ఆసీస్ మహిళలదే వన్డే సిరీస్..రెండో వన్డేలో భారత్ ఓటమి
Womens Team India : ఆసీస్ గడ్డపై టీ20 సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టుకు వన్డే సిరీస్ లో మాత్రం చుక్కెదురైంది. వరుసగా రెండో వన్డేలోనూ భారత్ పరాజయం పాలైంది.

Womens Team India
ఆసీస్ గడ్డపై టీ20 సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టుకు ( womens team India) వన్డే సిరీస్ లో మాత్రం చుక్కెదురైంది. వరుసగా రెండో వన్డేలోనూ భారత్ పరాజయం పాలైంది. బ్యాటర్లు రాణించినా బౌలర్లు మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. ఫలితంగా ఆస్ట్రేలియా మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు ప్రతీకా రావల్, స్మృతి మంధాన మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 78 పరుగులు జోడించారు. మంధాన (37 బంతుల్లో 31) ఔటవగా.. జెమీమా రోడ్రిగ్స్(11) విఫలమైంది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ప్రతీకా రావల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ప్రతీకా రావల్ 52 (6 ఫోర్లు) పరుగులకు ఔటవగా.. దీప్తి శర్మ(1), అమన్ జోత్ కౌర్(13) నిరాశపరిచారు. అయితే చివర్లో రిఛా ఘోష్ 22 , కష్వి గౌతమ్ 25 , క్రాంతి గౌడ్ 19 పరుగులతో పర్వాలేదనిపించారు.
దీంతో భారత్ మహిళల(womens team India) జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 251 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో గార్డనర్ 2 , అన్నాబెల్ సదర్లాండ్ 2 , అలానా కింగ్ 2 వికెట్లు పడగొట్టారు.

ఛేజింగ్ లో ఆస్ట్రేలియా 21 పరుగులకే అలీసా హీలీ వికెట్ కోల్పోయింది. అయితే లిచీఫీల్డ్ , జార్జియా వోల్ మాత్రం అదరగొట్టారు. రెండో వికెట్ కు 94 బంతుల్లోనే 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లిచీఫీల్డ్ 62 బంతుల్లో 80 (11 ఫోర్లు, 1 సిక్స్) పరుగులకు ఔటైనా జార్జియా వోల్ మాత్రం శతకం పూర్తి చేసుకుంది. ఆమె జోరును అడ్డుకోవడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.
జార్జియా వోల్ 82 బంతుల్లోనే 101(13 ఫోర్లు,1 సిక్స్ ) పరుగులకు ఔటైన తర్వాత ఆసీస్ బెత్ మూనీ, సదర్లాండ్ వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆష్లే గార్డనర్ 19 నాటౌట్ జట్టు విజయాన్ని పూర్తి చేసింది. దీంతో ఆస్ట్రేలియా 36.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. భారత బౌలర్లలో కష్వి గౌతమ్ 2, దీప్తి శర్మ 2 వికెట్లు తీసారు. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలుండగానే ఆసీస్ సిరీస్ ను కైవసం చేసుకుంది.



