BCCI : రోకో జోడీకి బీసీసీఐ బిగ్ షాక్..ఏ ప్లస్ నుంచి బి కేటగిరీకి మార్పు
BCCI : 2027 వన్డే ప్రపంచకప్ వరకూ కొనసాగాలని పట్టుదలగా ఉన్న రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ షాకిచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఈ దిగ్గజాలకు బి గ్రేడ్ కు డిమోట్ చేసింది
BCCI
భారత క్రికెట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శకం ఇక ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రోకో జోడీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ వరకూ కొనసాగాలని పట్టుదలగా ఉన్న రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ(BCCI) షాకిచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఈ దిగ్గజాలకు బి గ్రేడ్ కు డిమోట్ చేసింది.
కొత్త కాంట్రాక్ట్ జాబితాను బీసీసీఐ(BCCI) ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా జాతీయ మీడియా కథనాల ప్రకారం ఏ ప్లస్ కేటగిరీని పూర్తిగా తొలగించింది. మూడు ఫార్మాట్లలోనూ ఆడే ప్లేయర్స్ కు ఈ కేటగిరీలో చోటు దక్కేది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లు ఆడే ప్లేయర్స్ ఎవ్వరూ లేరు. రోహిత్ , కోహ్లీ వన్డేలకే పరిమితమవ్వగా.. గిల్ , బుమ్రా ఉన్నప్పటకీ వారిద్దరినీ కూడా రొటేషన్ పద్ధతిలో ఎంపిక చేస్తున్నారు. దీంతో ఏ ప్లస్ కేటగిరీని తీసేసిన బీసీసీఐ ఏ, బీ , సీ కేటగిరీలనే ఉంచింది.
బీసీసీఐ రూల్స్ ప్రకారం మూడు ఫార్మాట్లు ఆడే ప్లేయర్స్ కు ఎక్కువ వార్షిక ఫీజు లభించేది, కాగా కోహ్లీ, రోహిత్ లను ఇప్పుడు బీసీసీఐ బి కేటగిరీకి మార్పు చేసినట్టు సమాచారం. అయితే టీ20లకు గుడ్ బై చెప్పినప్పటకీ.. టెస్ట్, వన్డేల్లో కొనసాగుతున్న రవీంద్ర జడేజా మాత్రం ఏ కేటగిరీలో కొనసాగించేందుకు బోర్డు నిర్ణయించింది.

దీని ప్రకారం చూస్తే ఏ కేటగిరీలో జడేజాతో పాటు బుమ్రా, గిల్ మాత్రమే ఉన్నారు. గతంలో జడేజా, బుమ్రా కూడా రోహిత్ , కోహ్లీలలో ఏ ప్లస్ లో ఉండేవారు. ఆ కాంట్రాక్ట్ కేటగిరీ రద్దవడంతో ఏ కేటగిరీలోకి వచ్చారు. అటు బి కేటగిరీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ , హార్థిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, పంత్ , సిరాజ్ , వాషింగ్టన్ సుందర్ , కుల్దీప్ యాదవ్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే సి కేటగిరీలో తిలక్ వర్మ, శివమ్ దూబే, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ,సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ ఆకాష్ దీప్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఉన్నట్లు తెలుస్తోంది.



