Ind Vs Sa: 358 కొట్టినా ఓటమే.. చెత్త బౌలింగ్ తో ఓడిన భారత్
Ind Vs Sa: సింగిల్స్, డబుల్స్ తీస్తూ.. మధ్యమధ్యలో బౌందరీలు బాడుతూ వేగంగా పరుగులు చేశారు. ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ 52 బంతుల్లో, కోహ్లి 47 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించారు.
Ind Vs Sa
తొలి వన్డేలో గెలుపు ముంగిట బోల్తా పడిన సౌతాఫ్రికా (Ind Vs Sa)రెండో వన్డేలో మాత్రం వదల్లేదు. భారత పేలవమైన బౌలింగ్ ను ఆటాడుకుంటూ భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ ను సమం చేసింది. ఫలితంగా కోహ్లీ, రుతురాజ్ సెంచరీలు వృథాగా మిగిలితే.. సౌతాఫ్రికా (Ind Vs Sa)ఇన్నింగ్స్ మార్క్ రమ్ సెంచరీకి తోడు బవుమా, బ్రెవిస్, బీర్జ్కే విలువైన ఇన్నింగ్స్ లు ఆ జట్టు విజయానికి కారణమయ్యాయి.
తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగిన భారత్ కు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు జైస్వాల్, రోహిత్ శర్మ త్వరగానే ఔటయ్యారు. తొలి వికెట్ కు భారత ఓపెనర్లు 40 పరుగులు జోడించారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో కాస్త సమయం తీసుకున్న వీరిద్దరూ తర్వాత సఫారీ బౌలర్లను ఆటాడుకున్నారు.
సింగిల్స్, డబుల్స్ తీస్తూ.. మధ్యమధ్యలో బౌందరీలు బాడుతూ వేగంగా పరుగులు చేశారు. ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ 52 బంతుల్లో, కోహ్లి 47 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించారు. తర్వాత మరింత దూకుడుగా ఆడిన వీరిద్దరూ బౌండరీల మోత మోగించారు. 77 బంతుల్లో శతకాన్ని అందుకున్న రుతురాజ్ కెరీర్లో ఇదే తొలి సెంచరీ. వీరిద్దరూ మూడో వికెట్ కు 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
రుతురాజ్ ఔటైన తర్వాత కేఎల్ రాహుల్ తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ కొనసాగించాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డే కెరీర్లో విరాట్ కు ఇది 53వ సెంచరీ. ఓవరాల్ గా అంతర్జాతీయ కెరీర్లో 84వ శతకం. ఈ క్రమంలో పలు రికార్డులను కూడా అందుకున్నాడు.

వరుసగా రెండు సెంచరీలు చేయడం కోహ్లికి ఇది 11వ సారి. కోహ్లి ఔటయ్యాక వాషింగ్టన్ సుందర్ నిరాశపరిచినా రాహుల్, జడేజా దూకుడుగా ఆడారు. రాహుల్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయగా.. జడ్డూ కూడా ధాటిగా ఆడాడు. దీంతో భారత్ 5 వికెట్లకు 358 పరుగులు చేసింది. రాహుల్ 66, జడేజా 24 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
359 పరుగుల భారీ లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా (Ind Vs Sa)త్వరగానే ఓపెనర్ డికాక్ వికెట్ కోల్పోయింది. అయితే మార్క్ మ్, కెప్టెన్ బవుమా కలిసి సఫారీ ఇన్నింగ్స్ నిలబెట్టారు. వీరిద్దరూ రెండో వికెట్కు 101 పరుగులు జోడించారు. బవుమా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రతీ ప్రతీ బ్యాటర్ విలువైన ఇన్నింగ్స్ లు ఆడారు. మార్క్రరమ్, బ్రీజ్కే కలిసి 70 పరుగులు, బ్రెవిస్-బ్రీజ్కే కలిసి 92 పరుగులు భాగస్వామ్యాలు సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ను నిలబెట్టాయి.
భారీ స్కోరు ఛేదిస్తున్నప్పుడు భాగస్వామ్యాలు ఎంత కీలకమైనవో ఈ మ్యాచ్ ద్వారా అందరికీ అర్థమయింది. మార్క్రమ్ సెంచరీ సాధించగా.. బ్రెవిస్ 34 బంతుల్లో 54, బ్రీజ్కే 64 బంతుల్లో 68 రన్స్ తో మెరుపులు మెరిపించారు. ఫలితంగా సాధించాల్సిన రన్ రేట్ తగ్గుతూ వచ్చింది. దీనికి తోడు భారత బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. మధ్య మధ్యలో వికెట్లు తీసినా కీలక భాగస్వామ్యాలను బ్రేక్ చేయడంలో మన బౌలర్లు విఫలమయ్యారు. అదే సమయంలో చెత్త ఫీల్డింగ్ కూడా కొంపముంచింది.
పసలేని బౌలింగ్కు తోడు పేలవమైన ఫీల్డింగ్ కారణంగా భారత్ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. పైగా స్లో ఓవర్ రేట్ కారణంగా చివరి 3 ఓవర్ల సమయంలో సర్కిల్ అవతల ఒక ఫీల్డర్ తగ్గడం, మంచు ప్రభావం కూడా టీమిండియా ఓటమికి కారణమైంది. చివరికి సౌతాఫ్రికా మరో 4 బంతులు మిగిలుండగా టార్గెట్ అందుకుంది. వన్డేల్లో సౌతాఫ్రికాకు ఇది నాలుగో హయ్యెస్ట్ ఛేజింగ్. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే విశాఖలో శనివారం జరుగుతుంది.



