IND vs ENG : ప్రతీకారం తీర్చుకుంటారా ?..ఇవాళ భారత్, ఇంగ్లాండ్ తొలి వన్డే
IND vs ENG : టీ20 సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. సీనియర్లు కోహ్లీ, రోహిత్ , బుమ్రా, రాహుల్ వంటి ప్లేయర్స్ జట్టులోకి రావడంతో బలం పెరిగింది.
IND vs ENG
ఇంగ్లాండ్ టూర్లో భారత్ వన్డే సమరానికి రెడీ అయింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ మంగళవారం బర్మింగ్ హామ్ వేదికగా జరుగబోతోంది. టీ20 సిరీస్ వైట్ వాష్ పరాభవం నుంచి కోలుకుంటున్న టీమిండియా వన్డే సిరీస్ అదరగొట్టాలని పట్టుదలగా ఉంది. సిరీస్ విజయమే లక్ష్యంగా తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేయాలని ఎదురుచూస్తోంది.
దీని ద్వారా టీ20 సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. సీనియర్లు కోహ్లీ, రోహిత్ , బుమ్రా, రాహుల్ వంటి ప్లేయర్స్ జట్టులోకి రావడంతో బలం పెరిగింది. గాయాలతో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి దూరం కాగా.. వారి స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్లకు అవకాశం దక్కింది. కొన్ని రోజులుగా ఇంగ్లీష్ కండీషన్స్లో ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీ, రోహిత్పై భారీ అంచనాలున్నాయి.
2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న రోకో జోడీ ఇంగ్లాండ్ గడ్డపై దుమ్మురేపాలని ముమ్మరంగా సాధన చేస్తున్నారు. ఇటీవల ఆప్ఘనిస్తాన్తో సిరీస్కు గాయంతో దూరమైన కోహ్లీ ఇప్పుడు ఫిట్నెస్ సాధించాడు. అటు రోహిత్ కూడా ఫిట్నెస్పై ఫోకస్ పెట్టి ఇంగ్లాండ్తో సిరీస్కు సన్నద్ధమయ్యాడు. వీరిద్దరి రాకతో ఇషాన్ కిషన్ బెంచ్కే పరిమితం కానున్నాడు. అటు గిల్, రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా వన్ డౌన్లో కోహ్లీ ఆడతాడు. తర్వాత శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారు.
ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్కు చోటు దక్కనుంది. అటు పేస్ విభాగంలో బుమ్రా రాకతో మరింత బలం పుంజుకుంది. ఐపీఎల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన బుమ్రాకు ఈ సిరీస్ కీలకం కానుంది. అలాగే అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ లకు కూడా చోటు లభించనుంది. ప్రిన్స్ యాదవ్, ప్రసిధ్ కృష్ణల రూపంలో మరో ఇద్దరు అందుబాటులో ఉన్నారు.

మరోవైపు తొలి వన్డే కోసం ఇంగ్లాండ్(IND vs ENG) తమ తుది జట్టును ప్రకటించింది. యువ ఆల్రౌండర్ జేకబ్ బెతెల్ను ఓపెనర్గా పంపాలని నిర్ణయించింది. బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ , సామ్ కరన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. భారత బ్యాటింగ్ బలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.
ఇటీవల టీ20 సిరీస్లో భారత్ను చిత్తు చేసిన ఇంగ్లాండ్(IND vs ENG )అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. కాగా ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటి వరకూ 44 వన్డేలు ఆడిన భారత్ 18 మ్యాచ్లలో గెలిచి, 23 మ్యాచ్లలో పరాజయం పాలైంది. ఒక మ్యాచ్ టై కాగా మరో 2 ఫలితం తేలలేదు. చివరి సారిగా ఇక్కడ 2022లో ఆడినప్పుడు 2-1తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.
Womens Team : క్రికెట్ మక్కాలో సరికొత్త చరిత్ర.. లార్డ్స్లో భారత మహిళల జట్టు గ్రాండ్ విక్టరీ..





