Punjab Kings : వాంఖడేలో పంజాబ్ షో…చిత్తుగా ఓడిన ముంబై
Punjab Kings : ఐపీఎల్ 19వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఆటతీరు చూసాక ఈ మాట అనక తప్పదు. ప్రత్యర్థి ఎవరైనా దుమ్మురేపుతూ జైత్రయాత్ర కొొనసాగిస్తోంది
Punjab Kings
ఇది కదా ఆటంటే… ఐపీఎల్ 19వ సీజన్ లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఆటతీరు చూసాక ఈ మాట అనక తప్పదు. ప్రత్యర్థి ఎవరైనా దుమ్మురేపుతూ జైత్రయాత్ర కొొనసాగిస్తోంది. కింగ్ ఎక్కడైనా కింగ్ అన్నట్టుగా ఏ గ్రౌండ్ లో ఆడినా చెలరేగిపోతోంది. తాజాగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసింది. ప్రభ్ సిమ్రన్ సింగ్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ విధ్వంసం సృష్టించిన వేళ టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఫీల్డింగ్ ఎంచుకుంది.
పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీసి ముంబైని ఒత్తిడిలోకి నెట్టొచ్చు అనుకున్న పంజాబ్ వ్యూహం ఆరంభంలో వర్కౌట్ అయింది. కేవలం 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. రికెల్టన్ (2),సూర్యకుమార్ యాదవ్ (0) ఔటవడంతో ముంబై కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన క్వింటన్ డికాక్ రెచ్చిపోయాడు.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ స్కోరు పెంచాడు. అతనికి తోడుగా నమన్ ధీర్ కూడా చెలరేగిపోవడంతో ముంబై ఇన్నింగ్స్ పుంజుకుంది. వీరిద్దరూ మూడో వికెట్ కు కేవలం 68 బంతుల్లోనే 122 పరుగులు జోడించారు. నమన్ ధీర్ 31 బంతుల్లో 50(3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. డికాక్ దూకుడుగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అయితే చివర్లో ముంబై వేగంగా వికెట్లు చేజార్చుకుంది. హార్థిక్ (14), రూథర్ ఫర్డ్ (1), తిలక్ వర్మ ( 8) పరుగులకే వెనుదిరిగారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా డికాక్ (112) మాత్రం చివరి వరకూ క్రీజులో నిలిచాడు. చివర్లో పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై స్కోరు 195 పరుగులే చేయగలిగింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, జాన్సన్ 1, శశాంక్ 1 వికెట్ తీశారు.
196 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ కూడా తడబడింది. 45 పరుగులకే ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(15) , కూపర్ కన్నోలి(17) పరుగులకే ఔటయ్యారు. ఈ దశలో ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టారు. ముఖ్యంగా శ్రేయాస్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీ సాధించాడు.

అటు ప్రభ్ సిమ్రన్ సింగ్ అయితే ముంబై బౌలర్లను ఆటాడుకున్నాడు. భారీ సిక్సర్లతో వారిపై విరుచుకుపడ్డాడు. బుమ్రాతో సహా ఏ ఒక్క ముంబై బౌలర్ ను వదలకుండా ఉతికారేశాడు. ఫలితంగా మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది. వీరిద్దరూ 69 బంతుల్లోనే 133 పరుగులు జోడించారు. శ్రేయాస్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి ఔటయ్యాడు.
శ్రేయాస్ ఔటైనా ప్రభ్ సిమ్రన్ తన దూకుడు కొనసాగిస్తూ స్టోయినిస్ తో కలిసి మ్యాచ్ ను ముగించాడు. దీంతో పంజాబ్ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ప్రభ్ సిమ్రన్ సింగ్ 39 బంతుల్లో 80 ( 11 ఫోర్లు, 2 సిక్సర్లు) రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది.





