Team India : కొలంబో టెస్ట్లో క్లైమాక్స్ ఫైట్..ఆఖరి రోజు డ్రా అవుతుందా లేక భారత్ కొడుతుందా?
Team India : నాలుగో రోజు ఉదయం లంక తొలి ఇన్నింగ్స్ను 290 పరుగుల వద్ద ఆలౌట్ చేసిన టీమిండియా, ప్రత్యర్థికి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వెంటనే ఫాలోఆన్ ఇచ్చేసింది.
Team India
కొలంబో వేదికగా భారత్, లంక జట్ల మధ్య జరుగుతున్న సెకండ్ టెస్టు మ్యాచ్ థ్రిల్లింగ్ క్లైమాక్స్కి చేరుకుంది. మైదానంలో భారత్ బౌలర్లు.. వికెట్ల వేటలో దూకుడు చూపిస్తుంటే, మధ్యమధ్యలో వరుణుడు వచ్చి లంక జట్టును కాపాడుతూ వస్తున్నాడు.
అయితే నాలుగో రోజు ఆటలో వర్షం పదేపదే డిస్టర్బ్ చేయడంతో.. అంపైర్లు మ్యాచ్ను కాస్త ముందే ఆపేయాల్సి వచ్చింది. ఆట నిలిచే సమయానికి ఫాలోఆన్ ఆడుతున్న లంక జట్టు తమ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. బోర్డుపై 16 పరుగుల లీడ్ మాత్రమే ఉన్నా కూడా, మ్యాచ్ కంప్లీట్ కంట్రోల్ మాత్రం మన భారత్ చేతుల్లోనే ఉంది.
నాలుగో రోజు ఉదయం లంక తొలి ఇన్నింగ్స్ను 290 పరుగుల వద్ద ఆలౌట్ చేసిన టీమిండియా, ప్రత్యర్థికి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వెంటనే ఫాలోఆన్ ఇచ్చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్తో పోలిస్తే సెకండిన్నింగ్స్లో శ్రీ లంక బ్యాటర్లు కాస్త పట్టుదలగా ఆడారు.
మెయిన్గా పసిందు సూరియబండార (92) మరోసారి టాప్ క్లాస్ నాక్తో మెరిస్తే, కమిందు మెండిస్ (55) అతనికి బాగానే సపోర్ట్ ఇచ్చాడు. వీరిద్దరూ మూడో వికెట్కు చాలా కీలకమైన పార్టనర్షిప్ నెలకొల్పి లంకను కష్టాల్లోంచి బయటపడేసేలా కనిపించారు. దీంతో శ్రీలంక డ్రెస్సింగ్ రూమ్లో మళ్లీ ఆశలు చిగురించాయి.
అయితే క్రీజులో సెట్ అయ్యాక కమిందు మెండిస్ చేసిన ఒక చిన్న పొరపాటు..మొత్తం మ్యాచ్ రూపురేఖలనే మార్చేసింది. ప్రసిధ్ కృష్ణ వేసిన బాల్కి అనవసరంగా పెద్ద షాట్ ఆడబోయి స్క్వేర్ లెగ్ వైపు గాల్లోకి లేపాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న శుభ్మన్ గిల్.. వెనక్కి పరుగెడుతూ పట్టిన ఆ మైండ్ బ్లాకింగ్ క్యాచ్తో లంక జట్టు పతనం మొదలైంది.
ఆ వికెట్ పడటంతోనే భారత్ మళ్లీ మ్యాచ్పై పూర్తి గ్రిప్ సాధించింది. ఆ వెంటనే సెంచరీకి అతి దగ్గరలో ఉన్న సూరియబండారకు మానవ్ సుతార్ పెవిలియన్ దారి చూపించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ధనంజయ డి సిల్వా (23), నిరోషన్ డిక్వెల్లా (6) కూడా చేతులెత్తేశారు.

వాన వల్ల ఆట నిలిచిపోయే టైమ్కు సోనల్ దినుషా (7), కేశర నువంత (3) నాటౌట్గా క్రీజులో ఉన్నారు. లంకకు మరో 8 ఓవర్లలో కొత్త బాల్ అందుబాటులోకి రానుండటం.. భారత పేసర్లకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఐదో రోజు కూడా వాన పడే ఛాన్స్ ఉన్నా.. వాతావరణం సహకరిస్తే కనుక మ్యాచ్ రిజల్ట్ రావడం పక్కా.
టీమిండియా(Team India) ఈ మ్యాచ్లో విజయాన్ని సాధించాలంటే శ్రీలంక జట్టులో మిగిలిన 4 వికెట్లను త్వరగా పడగొట్టి, ఆ తర్వాత ఇచ్చే చిన్న టార్గెట్ను ఛేజ్ చేయాలి. భారత బౌలర్లలో మానవ్ సుతార్ రెండు వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రవీంద్ర జడేజా, సారాంశ్ జైన్ తలో వికెట్ తమ అకౌంట్లో వేసుకున్నారు.





