RTC Strike : తెలంగాణలో ఆగని ఆర్టీసీ సమ్మె.. సందిట్లో సడేమియాలుగా మగ ప్రయాణికులు
RTC Strike : తెలంగాణలో టీజీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు బస్సులన్నిటినీ డిపోలకే పరిమితం చేసి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు
RTC Strike
తెలంగాణలో టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు బస్సులన్నిటినీ డిపోలకే పరిమితం చేసి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తెలంగాణ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయి, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రయాణికులకు కొంత వరకూ అయినా ఊరట కలిగించడానికి ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవర్లు , అద్దె బస్సుల ద్వారా సేవలను అందిస్తోంది. పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ బస్సులన్నీ నడుస్తున్నాయి.
అయితే, బస్సుల్లో కండక్టర్లు అందుబాటులో ఉండకపోవడంతో.. డ్రైవర్లే టికెట్లు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులు తమంతట తాము డ్రైవర్ వద్దకు వెళ్లి టికెట్లు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న వారి సంఖ్య ఎక్కువవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ప్రస్తుత పరిస్థితుల్లో బస్సుల్లో కండక్టర్లు లేకపోవడంతో .. పురుష ప్రయాణికులు దీనిని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉందన్న విషయం తెలిసిందే. మగవారు మాత్రమే కచ్చితంగా టికెట్లు కొనుగోలు చేసేవారు. అయితే ఇప్పుడు, డ్రైవర్ వద్దకు వెళ్లి టికెట్ తీసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపించడం లేదు. వీరంతా టికెట్ లేకుండానే ఉచితంగా ప్రయాణించడంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.


మరోవైపు ఆర్టీసీ సమ్మెపై(RTC Strike) తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్టీసీ ఒక ప్రాణాధారమని, సంస్థ మనుగడను, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్మికులు వెంటనే సమ్మె విరమించాలని ఆయన కోరారు.
ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 డిమాండ్లలో ఇప్పటికే 29 అంశాలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మిగిలిన 3 అంశాలపై మాత్రమే చర్చలు జరుగుతున్నాయని అన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ చర్చలు జరుపుతున్న సమయంలో ఇలా హఠాత్తుగా సమ్మెకు వెళ్లడం వెనుక ప్రతిపక్షాల హస్తం ఉందని పొన్నం ఆరోపించారు.
Dating : డేటింగ్ చేస్తే రూ.12 వేలు.. యువతకు ప్రభుత్వం బంపరాఫర్..





