IPL: ఐపీఎల్ టికెట్ల ఆరోపణలలో హెచ్సీఏ అధ్యక్షుడు అరెస్ట్
IPL: సన్రైజర్స్తో వివాదం: ఐపీఎల్ టికెట్ల ఆరోపణలలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు అరెస్ట్ !

IPL:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య నెలకొన్న వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావుతో పాటు పలువురు హెచ్సీఏ సభ్యులను సీఐడీ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) అరెస్ట్ చేసింది. ఐపీఎల్ టికెట్ల (IPL Tickets )పంపిణీకి సంబంధించి వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి.
టికెట్ల వివాదంతో మొదలైన రగడ
IPL: గత ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరియు హెచ్సీఏ మధ్య టికెట్ల కేటాయింపు విషయంలో తీవ్ర వివాదం చెలరేగింది. ఆరోపణల ప్రకారం, ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తమకు 10% టికెట్లను ఉచితంగా ఇస్తామని ప్రతిపాదించింది. అయితే, హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు మాత్రం 20% టికెట్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఈ డిమాండ్ను తిరస్కరించడంతో, హెచ్సీఏ ప్రతినిధులు ఒక ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీకి తాళాలు వేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై సన్రైజర్స్ యాజమాన్యం (SRH Management) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హెచ్సీఏ వైఖరి మారకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ను వదిలి వెళ్ళిపోతామని హెచ్చరించింది. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించి విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
విజిలెన్స్ నివేదిక, సీఐడీ అరెస్ట్లు
విజిలెన్స్ విచారణలో అనేక కీలక అంశాలు బయటపడ్డాయి. టికెట్ల కేటాయింపు విషయంలో సన్రైజర్స్పై హెచ్సీఏ ఒత్తిడి తెచ్చిందని, 20% ఉచిత టికెట్ల కోసం బెదిరింపులకు గురిచేసిందని విజిలెన్స్ కమిటీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా, సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఈ దర్యాప్తులో భాగంగానే హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావుతో పాటు మరికొందరు హెచ్సీఏ సభ్యులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్లు హైదరాబాద్ క్రికెట్(Hyderabad Cricket) వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఈ ఘటన క్రికెట్ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంపై చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది.అయితే ఈ వివాదం హైదరాబాద్ క్రికెట్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.