YCP: పులివెందులలో 30 ఏళ్ల తర్వాత టీడీపీ గెలుపు.. వైసీపీ పతనానికి కారణాలు
YCP : దేశంలో అత్యంత ప్రభావవంతమైన నియోజకవర్గాల్లో ఒకటైన పులివెందులలో జగన్ కుటుంబం ఓటమి పొందడం, ఆ స్థానంలో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోవడం ప్రజల్లో పార్టీపై ఎంత తీవ్రమైన వ్యతిరేకత పెరిగిందో స్పష్టం చేస్తుంది.

YCP
వైసీపీకి పులివెందులలో భారీ షాకే తగిలింది. ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత టీడీపీ విజయం సాధించడం అంటే చిన్న విషయం కాదు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాదు.. ఇప్పుడు జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలోనూ వైసీపీ ఘోర పరాజయం పాలయింది.దీంతో ఇప్పటికీ ప్రజలు జగన్ను వ్యతిరేకిస్తున్నార్నందుకు దీనిని ఉదాహరణగా చెప్పొచ్చుని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జగన్పై వ్యతిరేకతకు ప్రధాన కారణాలలో నెంబర్ వన్ బలహీనమైన పార్టీ నిర్మాణం, వ్యూహాత్మక లోపాలు. వైసీపీ ఎన్నికల వ్యూహంలో ఐ-ప్యాక్ (I-PAC) మౌలిక వైఫల్యాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ క్యాడర్ను కాదని, కేవలం జగన్ను మాత్రమే హైలైట్ చేస్తూ ప్రచారం జరగడం కిందిస్థాయి నాయకత్వాన్ని నిరుత్సాహపరిచింది. మైదాన స్థాయిలో ఉన్న సమస్యలు పాలకవర్గానికి, ముఖ్యంగా జగన్కు చేరకపోవడం ప్రధాన లోపంగా చెబుతున్నారు.
అలాగే ప్రజలతో అనుసంధాన లోపం కూడా ఉంది. జగన్(Jagan) తన ఐదేళ్ల పాలనలో మీడియా ఎదుట నేరుగా ఒకే ఒక్క ప్రెస్మీట్ పెట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది పాలనలో పారదర్శకత లోపానికి, ప్రజల సందేహాలను స్వయంగా పరిష్కరించడంలో ఉన్న వైఫల్యానికి నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై గానీ, రాష్ట్రంలోని కీలక సమస్యలపై గానీ జగన్ స్వయంగా స్పందించకపోవడం ప్రజల్లో అనుమానాలను పెంచింది.
అంతేకాదు కుటుంబ విభేదాలు, విశ్వసనీయత లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జగన్ కుటుంబంలో ఆయన సోదరి వైఎస్ షర్మిల(YS Sharmila), తల్లి విజయమ్మతో వచ్చిన రాజకీయ విభేదాలు ప్రజల్లో విస్తృతంగా చర్చకు దారితీశాయి. తన కుటుంబ సభ్యులతోనే న్యాయంగా వ్యవహరించని నాయకుడు రాష్ట్ర ప్రజల పట్ల ఎంతవరకు నిబద్ధతతో ఉంటాడో అనే సందేహం ప్రజల్లో బలపడింది. ఒక వ్యక్తికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం, కుటుంబ సభ్యులకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల జగన్పై ప్రజలకు ఉన్న నమ్మకం సన్నగిల్లిందని భావిస్తున్నారు.
జగన్ పరిపాలనలో ప్రభుత్వ వ్యతిరేకత, పాలనలో లోపాలు చాలానే బయటపడ్డాయి. పట్టణాభివృద్ధి లేకపోవడం, ఉద్యోగావకాశాలు తగ్గడం, ప్రభుత్వ ఉద్యోగుల వేతన సమస్యలు పరిష్కరించకపోవడం, విద్యుత్, బస్సు ఛార్జీలు, మద్యం ధరలు పెంచడం వంటి కీలక విషయాల్లో జగన్ ప్రభుత్వం విఫలమైందని ప్రజాభిప్రాయాలు, మీడియా విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. అమరావతిని రాజధానిగా కాకుండా మూడు రాజధానుల నిర్ణయం రెండు ప్రాంతాల ప్రజలను అసంతృప్తికి గురిచేసిందని కూడా విశ్లేషణ ఉంది.
అవే కాదు కీలక సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత బాగానే పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సమస్యలు పరిష్కరించకపోవడం ఉద్యోగ సంఘాల్లో నిరాశను నింపింది. అలాగే, వ్యవసాయ మద్దతు ధరల్లో లోపాలు రైతుల ఆగ్రహానికి కారణమయ్యాయి. సామాజిక వర్గాలను సమర్థవంతంగా సమన్వయం చేయడంలో విఫలమవడం కూడా వైసీపీ ఓటమికి ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు.
ఇక ఇదేసమయంలో ప్రతిపక్ష కూటమి వ్యూహాత్మక విజయం సాధించడంలో సక్సెస్ అయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి సమర్థవంతమైన కూటమిగా ఏర్పడ్డాయి. తమలోని అసంతృప్తిని సమన్వయంగా ప్రభుత్వంపై వినిపించడంలో ఈ కూటమి విజయవంతమైంది. ఈ వ్యూహాత్మక కూటమి ప్రభావం వైసీపీని ఎన్నికల్లో వెనుకడుగు వేసేలా చేసింది.

జగన్ వ్యతిరేకత ఇంకా తగ్గలేదనడానికి పులివెందుల ఫలితం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో అత్యంత ప్రభావవంతమైన నియోజకవర్గాల్లో ఒకటైన పులివెందులలో జగన్ కుటుంబం ఓటమి పొందడం, ఆ స్థానంలో వైసీపీ (YCP)అభ్యర్థి డిపాజిట్ కోల్పోవడం ప్రజల్లో పార్టీపై ఎంత తీవ్రమైన వ్యతిరేకత పెరిగిందో స్పష్టం చేస్తుంది.
టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 5,794 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ( YCP) అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో టీడీపీ విజయం సాధించడం ప్రజల తీర్పును సూచిస్తుంది. ఎన్నికల సమయంలో జరిగిన చిన్నచిన్న ఘటనలను పట్టించుకోకుండా, ప్రజలు తమ ఓటు హక్కును ఉపయోగించుకుని ఇచ్చిన ఈ తీర్పు, జగన్ పాలనపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచింది.