Politics: నిలువునా చీలిన లాలూ కుటుంబం.. తెలుగు రాష్ట్రాల సీన్స్ రిపీట్
Politics: సంజయ్ యాదవ్ గతంలో చాలా సార్లు రోహిణిని అవమానించారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే తేజస్వీ కోరిక మేరకు రోహిణి సింగపూర్ నుంచి వచ్చి ప్రచారం చేశారు.
Politics
దేశ వ్యాప్తంగా పొలిటికల్(Politics) ఫ్యామిలీస్లో వివాదాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. కుటుంబంతో విభేదించి బయటికి వచ్చేసిన వాళ్ల లిస్ట్లో మొన్నటి వరకూ కవిత, షర్మిల మాత్రమే ఉండేవాళ్లు.. కానీ ఆ లిస్ట్లో ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య కూడా చేరింది. తేజస్వియాదవ్, ఆయన అనుచరులు కలిసి తనను దారుణంగా అవమానించారంటూ రోహిణి తీవ్ర ఆరోపణలు చేసింది.
ఇకపై ఆ కుటుంబంతో, ఆర్జేడీతో తన సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో, రోహిణి ముగ్గురు చెల్లెళ్లు కూడా పట్నాలోని లాలూ నివాసాన్ని వదిలేసి ఢిల్లీకి వెళ్లిపోయారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైన మరుసటి రోజే.. లాలూ కుటుంబంలో చిచ్చు మొదలయ్యింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణ ఓటమికి తేజస్వియాదవ్ సన్నిహితులు హరియాణాకు చెందిన ఎంపీ సంజయ్ యాదవ్, యూపీకి చెందిన రమీజ్ కారణమని రోహిణి ఆరోపించింది.
సంజయ్ యాదవ్ గతంలో చాలా సార్లు రోహిణిని అవమానించారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే తేజస్వీ కోరిక మేరకు రోహిణి సింగపూర్ నుంచి వచ్చి ప్రచారం చేశారు. కాగా తాజా విభేదాల నేపథ్యంలో లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన సోదరి రోహిణి ఆచార్యకు మద్దతు తెలిపారు. రోహిణి ఆచార్య పట్ల తమ కుటుంబం వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం లాలూ కుటుంబంలో నెలకొన్న అంతర్గత విభేదాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను గుర్తు చేస్తున్నాయి. గతంలో వైఎస్ఆర్ కుటుంబంలో కూడా ఇదే సీన్ కనిపించింది. జగన్తో రాజకీయంగా విభేదించిన షర్మిల పార్టీ నుంచి బయటికి వచ్చేసింది. షర్మిల జగన్తో విభేదించడానికి రాజకీయ కారణాలతో పాటు వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయి.
ఇటు తెలంగాణలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కేసీఆర్ కుటుంబంలో కనిపించింది. మొదటి నుంచి పార్టీలో కీలకంగా ఉంటూ రాజకీయం(Politics) చేసిన కవిత తన పొలికల్ తెలివిని ఫ్యామిలీ మీదే వాడింది. పార్టీలో హరీష్ రావు, సంతోష్ రావును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేసింది. వాళ్ల వల్లే పార్టీ నాశనం అవుతోందని, తెలంగాణలో అధికారం పోవడానికి కూడా వాళ్లే కారణమంటూ ఆరోపించింది. ఇలా దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో ఉన్న ఏ కుటుంబంలో చూసినా వ్యక్తిగత రాజకీయాలు కనిపించడం.. అది కూడా కూతుళ్లే తిరుగుబాటు చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.



