IND vs PAK : మ్యాచ్ కాదు అంతకుమించి..కొలంబోలో హై ఓల్టేజ్ ఫైట్
IND vs PAK :భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే అది ఆట కాదు వేట...మైదానంలో జరిగే యుద్ధం.. ఇక్కడ ఆట కంటే భావోద్వేగాలే ఎక్కువ హైలెట్ అవుతాయి
IND vs PAK
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది.. వరల్డ్ క్రికెట్ లో హైఓల్టేజ్ ఫైట్ కు కౌంట్ డౌన్ మొదలైంది.. చిరకాల ప్రత్యర్థుల మధ్య క్రికెట్ యుద్ధానికి కొలంబో సిద్ధమైంది. భారత్, పాకిస్థాన్(IND vs PAK) మ్యాచ్ అంటే అది ఆట కాదు వేట…మైదానంలో జరిగే యుద్ధం.. ఇక్కడ ఆట కంటే భావోద్వేగాలే ఎక్కువ హైలెట్ అవుతాయి.
సాధారణ అభిమాని నుంచి ప్రధాని మంత్రి వరకూ అందరి దృష్టీ ఈ మ్యాచ్ పైనే.. ఫార్మాట్ ఏదైనా, ఆడుతోంది ఎక్కడైనా భారత్, పాకిస్తాన్(IND vs PAK) తలపడుతున్నాయంటే చాలు ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ఇరు జట్ల ఆటగాళ్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆడే మ్యాచ్ ఇది.. అటు అభిమానులు కూడా అంతే… ఇప్పుడు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు.
చాలా ఏళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడతున్నాయి. ఆసియాకప్, ప్రపంచకప్ లలో మాత్రమే చిరకాల ప్రత్యర్థుల క్రికెట్ సమరాన్ని అభిమానులు చూస్తున్నారు. గత ఏడాది ఆసియాకప్ నుంచి భారత్, పాక్(IND vs PAK) మధ్య నో షేక్ హ్యాండ్ వివాదం ఈ పోరును మరోస్థాయికి తీసుకెళ్లింది. పుల్వామా దాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత క్రికెటర్లు నిరాకరించడంతో పాక్ నానా హంగామా చేసింది.
ఆసియాకప్ ట్రోఫీని సైతం ఏసీసీ ఛైర్మన్ గా ఉన్న పాక్ మంత్రి మోహ్సిన్ నఖ్వీ నుంచి తీసుకునేందుకు ఒప్పుకోలేదు. ఇటీవల బంగ్లాదేశ్ తో భారత్ వివాదంలో అనవసరంగా జోక్యం చేసుకున్న పాక్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నామంటూ నానా హడావుడి చేసింది. చివరికి ఐసీసీ వార్నింగ్ ఇవ్వడం, బ్రాడ్ కాస్టర్లు భారీ నష్టపరిహారం వసూలు చేస్తామని చెప్పడంతో వెనక్కి తగ్గి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది.
ఈ సారి కూడా పాక్ క్రికెటర్లతో నో షేక్ హ్యాండ్ విధానానికే భారత్ కట్టుబడి ఉందని సమాచారం. టాస్ సమయంలోనూ, మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ క్రికెటర్లతో షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై పీసీబీ ఎంత ఓవరాక్షన్ చేసినా తగ్గేదే లేదని భారత్ డిసైడ్ అయినట్టు స్పష్టమవుతోంది.

ఇదిలా ఉంటే పాక్ తో ఎప్పుడు మ్యాచ్ జరిగే టీమిండియానే ఫేవరెట్. ఎందుకంటే ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు పై భారత్ దే ఆధిపత్యం. ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో ఇరు జట్లు 8 సార్లు తలపడితే భారత్ 7 మ్యాచ్ లలో గెలిచింది. ఇప్పుడు మరోసారి తన రికార్డును కొనసాగించాలని భావిస్తోంది. ప్రస్తుతం రెండు విజయాలతో సూపర్ 8కు చేరువైన భారత్ పాక్ ను ఓడిస్తే బెర్త్ ఖరారు చేసుకుంటుంది.
మరోవైపు పాక్ జట్టు కూడా ఆడిన రెండు మ్యాచ్ లలోనూ గెలిచినప్పటకీ నెదర్లాండ్స్ పై తడబడ్డారు. పటిష్టమైన భారత్ ను నిలువరించాలంటే పాక్ అంచనాలకు మించి రాణించాల్సిందే. అయితే ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్ ను తక్కువ అంచనా వేస్తే మాత్రం భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి పాక్ ను చిత్తు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.



