Varalakshmi Vratam Prasadam : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. ఈ 5 నైవేద్యాలు ఈజీగా ఇలా ట్రై చేయండి..
Varalakshmi Vratam Prasadam : ఇంట్లో ప్రసాదాలు తయారు చేసినా కూడా వారికి టెంపుల్ ప్రసాదంలా కమ్మటి టేస్ట్ , టెక్స్చర్ రాదు. కానీ ఈ పండుగకి మీ ఇంట్లో కూడా గుడిలో ఇచ్చే ప్రసాదంలా అద్భుతమైన రుచి రావడానికి ఈ 5 నైవేద్యాలను సింపుల్ టిప్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాం.
Varalakshmi Vratam Prasadam
శ్రావణ మాసంలో మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో ఇంట్లోకి ఆహ్వానిస్తూ మహిళలంతా వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకొంటారు. అయితే ఈ పూజలో అమ్మవారికి అత్యంత నిష్ఠతో సమర్పించే నైవేద్యాలకి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది.
కానీ చాలామంది ఇంట్లో ప్రసాదాలు తయారు చేసినా కూడా వారికి టెంపుల్ ప్రసాదంలా(Varalakshmi Vratam Prasadam) కమ్మటి టేస్ట్ , టెక్స్చర్ రాదు. కానీ ఈ పండుగకి మీ ఇంట్లో కూడా గుడిలో ఇచ్చే ప్రసాదంలా అద్భుతమైన రుచి రావడానికి ఈ 5 నైవేద్యాలను సింపుల్ టిప్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాం.
ప్రసాదాల్లో ఎప్పుడు కూడా రాణి వంటిది పరమాన్నం అనే చాలా మంది భావిస్తారు. పరమాన్నం వండేటప్పుడు చాలామందికి పాలు విరిగిపోతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే బెల్లాన్ని ముందే వేడి చేసి, చల్లార్చుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నాన్ని కేవలం పాలల్లో మాత్రమే ఉడికిస్తూ, ఉడికేటప్పుడు మీగడ కలిపితే క్రీమీగా వస్తుంది. చివర్లో బెల్లం పాకంతో పాటు యాలకులు, పచ్చకర్పూరం, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం, కిస్మిస్లు కలిపితే గుడి ప్రసాదంలా ఉండే పరమాన్నం రెడీ. కన్సిస్టెన్సీ సరిగ్గా చూస్తే చాలు చల్లారినా గట్టిపడదు.

కమ్మని చింతపండు పులిహోర పొడిపొడిగా రావడానికి అన్నం వండేటప్పుడే కాస్త నూనె వేయాలి. మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలను మిక్సీ పట్టుకుని పులిహోర పొడిని సిద్ధం చేసుకోవాలి. పోపులో పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఇంగువ, కరివేపాకు , ఎండుమిర్చి వేసి.. చింతపండు గుజ్జులో మాత్రం పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, చిన్న బెల్లం ముక్క వేసి దగ్గరపడే వరకు ఉడికించుకోవాలి. పొడిపొడి అన్నంలో ఈ గుజ్జు, పోపు, తయారు చేసి పెట్టకున్న హోమ్మేడ్ పొడిని కలిపితే అద్భుతమైన పులిహోర రెడీ అయిపోతుంది.

అలాగే రవ్వ కేసరి కోసం నెయ్యిలో రవ్వను దోరగా వేయించాక తగినన్ని నీళ్లు, చక్కెర వేసి ఉడికించాలి. రవ్వ ఉడికాక యాలకుల పొడి, కావాలి అనుకున్నవాళ్లు ఫుడ్ కలర్, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్లు వేసి కలపాలి. చివర్లో ఇంకొంచెం నెయ్యి జోడిస్తే చల్లారినా గట్టిగా అవ్వకుండా మృదువుగా ఉండే రవ్వ కేసరి సిద్ధమవుతుంది.

ఇక పూర్ణం బూరెలు బయటకు కరకరలాడుతూ, లోపల పూర్ణం లీక్ అవ్వకుండా ఉండాలంటే మినపప్పును మెత్తగా, రైస్ను కాస్త బరకగా రుబ్బుకోవాలి. పచ్చిశనగపప్పును ఉడికించి, బెల్లం వేసి కాస్త ముద్దగా ఉడికించి పూర్ణం తయారుచేసేటప్పుడు.. సోంపు, యాలకులు, నెయ్యి వేస్తే మంచి స్మెల్ వస్తుంది. పూర్ణం పల్చగా అనిపిస్తే వేయించిన బొంబాయి రవ్వ కలిపితే సరిపోతుంది. ఒకవేళ నూనెలో పూర్ణం బయటపడితే, ఆ బూరెను తీసేసి బియ్యప్పిండి అద్ది మళ్లీ వేయించొచ్చు.

చివరిగా అల్లం గారెల కోసం.. మినపప్పుతో పాటు కాస్త పచ్చిశనగపప్పు, కొద్దిగా బియ్యం పోసి నానబెట్టి, తక్కువ నీళ్లతో మెత్తగా రుబ్బుకోవాలి. పిండిలో సన్నగా కోసిన పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. పిండిని ఒకే దిశలో రెండు, మూడు నిమిషాలు బాగా తిప్పితే సోడా వేయకుండానే గారెలు మెత్తగా వస్తాయి. మీడియం మంటపై వేయిస్తే నూనె ఎక్కువ పీల్చకుండా సాఫ్ట్గా వస్తాయి.






