IPL : ఒకట్రెండు రోజుల్లో ఐపీఎల్ షెడ్యూల్..రెండు దశల్లో విడుదల
IPL : ఐపీఎల్ షెడ్యూల్ విడుదల ఆలస్యమవుతుండగా దీనిపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది. మార్చి 6 లేదా 7 తేదీల్లో ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించనున్నట్టు తెలిపింది
IPL
ఊహించిందే జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ పై పలు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం పడింది. ఈ కారణంగానే ఐపీఎల్(IPL) షెడ్యూల్ విడుదల ఆలస్యమవుతుండగా దీనిపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది. మార్చి 6 లేదా 7 తేదీల్లో ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షెడ్యూల్ పై కసరత్తు చేస్తోంది. నిజానికి ఈ పాటికే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల కావాలి.
మార్చి 26 నుంచి మొదలుపెట్టాలని అనుకున్నా సరే.. మార్చి 28 నుంచి సీజన్ ఆరంభం కానుంది. ఫైనల్ మే 31న జరగనుండగా.. షెడ్యూల్ ను మాత్రం బీసీసీఐ ఖరారు చేయలేదు. దీనికి కారణంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడమే. ఎన్నికల నిర్వహణ సమయంలో పోలీసు భద్రత, ఇతర ఏర్పాట్లు కష్టంగా మారతాయి. ఈ సారి పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడులో ఎన్నికలు జరగనుండగా.. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఐపీఎల్ వేదికలున్నాయి.
అందుకే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాతే అక్కడి నిర్వహించే మ్యాచ్ లపై క్లారిటీ రానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ షెడ్యూల్ ను రెండు దశల్లో విడుదల చేయనున్నారు. మొదటి దశలో రెండు వారాలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటిస్తారు. ఈ టైమ్ లో 20 నుంచి 25 మ్యాచ్ లు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపు ఎన్నికల సంఘం ప్రకటించే ఆయా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకుని రెండో దశ షెడ్యూల్ ను ఖరారు చేయనున్నారు.

ఈ మేరకు ఫ్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమాచారమిచ్చింది. ఎప్పటిలానే ఈ సారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్ హోం గ్రౌండ్ లో ఆరంభ మ్యాచ్ నిర్వహించనున్నారు. గత ఏడాది విజేతగా నిలిచిన ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుండగా.. ప్రత్యర్థి ఎవరన్నది మాత్రం ఖరారు కాలేదు. ఈ సారి ఆర్సీబీ తన హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఐదు మ్యాచ్ లు ఆడనుండడం ఖాయమైంది.
కర్ణాటక ప్రభుత్వం అనుమతివ్వడంతో ఆర్సీబీ మేనేజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది. ఇదిలా ఉంటే గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు, యుద్ధ వాతావరణ పరిస్థితులు ఐపీఎల్(IPL )విదేశీ ఆటగాళ్లు ఆడడంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటికీ తాజా పరిస్థితులు సద్దుమణిగే అవకాశముందని బీసీసీఐ భావిస్తున్నప్పటకీ.. యుద్ధ వాతావరణం కొనసాగితే మాత్రం విదేశీ క్రికెటర్లు ఆడేందుకు రాకపోవచ్చు.



