Shafali Verma : దంచికొట్టిన షెఫాలీ..బంగ్లాను చిత్తు చేసిన భారత్
Shafali Verma : రన్ రేట్ పెంచుకోవడమే లక్ష్యంగా ఛేజింగ్లో భారత్ బ్యాటింగ్ సాగింది. ఓపెనర్ షెఫాలీ వర్మ దంచికొట్టింది.
Shafali Verma
మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్ కీలక విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ పై 5 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్ రేసులో నిలిచింది. బౌలింగ్ లో రాధా యాదవ్, బ్యాటింగ్ లో షెఫాలీ వర్మ మెరిసారు. అయితే ఎప్పటిలానే పలు క్యాచ్ లు జారవిడిచి తమ ఫీల్డింగ్ లోపాలను మరోసారి బయటపెట్టుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మధ్య మధ్యలో వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ కీలక సమయంలో పుంజుకుంది. కెప్టెన్ నిగర సుల్తానా, జువైరియా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పే ప్రయత్నంలో జట్టుకు ఓ మాదిరి స్కోరు అందించారు.
ఒకదశలో 150 ప్లస్ స్కోరు సాధించేలా కనిపించినా చివర్లో భారత బౌలర్లు బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఫలితంగా బంగ్లాదేశ్ మహిళల జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 3 , శ్రీచరణి 2 వికెట్లు తీసారు. ఈ క్రమంలో శ్రీచరణి చరిత్ర సృష్టించింది.
ఈ మెగాటోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డులకెక్కింది. ఈ తెలుగమ్మాయి ఇటీవలే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచింది.
కాగా రన్ రేట్ పెంచుకోవడమే లక్ష్యంగా ఛేజింగ్ లో భారత్ బ్యాటింగ్ సాగింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(Shafali Verma) దంచికొట్టింది. తన సహజ శైలిలో మెరుపులు మెరిపించింది. స్మృతి (8) నిరాశపరిచినా యస్తికా భాటియాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 34 బంతుల్లోనే 53( 8 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేసింది.

వేగంగా ఆడే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయినా జెమిమా రోడ్రిగ్స్ (26) మెరుపులు, హర్మన్ ప్రీత్ కౌర్ సమయోచిత బ్యాటింగ్ భారత్ కు సునాయాస విజయాన్నందించాయి. భారత్ మరో 3.1 ఓవర్లు మిగిలుండగానే టార్గెట్ ను అందుకుంది. ఈ విజయంతో సెమీస్ రేసులో నిలిచిన భారత్ తర్వాతి మ్యాచ్ లో ఆసీస్ ను ఢీ కొంటుంది. ఆసీస్ పై గెలిస్తే నేరుగా సెమీస్ బెర్త్ దక్కించుకుంటుంది. ఒకవేళ ఓడితే మాత్రం రన్ రేట్ కీలకం కానుంది.
Pune Murder Case : పూణే మర్డర్ కేసులో ఎవరిది తప్పు? ఆ ముగ్గురు తండ్రుల గుండెకోతకు కారణం ఏంటి?





