Zombie Reddy :మన దేశంలోనూ జాంబీ రెడ్డి సీన్లు ఎందుకు? ఈ వింత ప్రవర్తనలు ఆగవా ?
Zombie Reddy : అమెరికాను వణికిస్తున్న జైలజైన్ అనే డ్రగ్.. ఇప్పుడు భారత్లోకి కూడా ఏదో ఒక రూపంలో ప్రవేశిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Zombie Reddy
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన జాంబీ రెడ్డి(Zombie Reddy ) మూవీ మనందరికీ గుర్తే. కర్నూలు ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్తో జాంబీ వైరస్ను జోడించి తీసిన ఆ మూవీ చూస్తున్నప్పుడు.. ఇదంతా కేవలం వెండితెరపై జరిగే రీల్ స్టోరీ మాత్రమేనని అనుకున్నాం.
కానీ, ఇప్పుడు దేశంలోని కొన్ని నగరాల్లో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే, ఆ సినిమాలోని సీన్లు రియల్ లైఫ్లోకి వచ్చేస్తున్నాయా అనే అనుమానం కలుగుతుంది. ముఖ్యంగా బెంగళూరు,బీహార్, చండీగఢ్ వంటి సిటీల్లో కొంతమంది వ్యక్తులు నడిరోడ్డుపై వింతగా నిలబడిపోవడం, విగ్రహాల్లా గంటల తరబడి ఉండిపోవడం వంటి ఘటనలు వైరల్ కావడంతో భారత్లో కూడా జాంబీ మనుషులు తయారవుతున్నారనే చర్చ మొదలైంది.
మూవీలో జాంబీ రెడ్డి(Zombie Reddy )వైరస్ వల్ల మనుషులు జాంబీలుగా మారితే, నిజ జీవితంలో మాత్రం సింథటిక్ డ్రగ్స్ అనే భయంకరమైన పాయిజన్ మనుషులను ప్రాణం ఉన్న డెడ్ బాడీలుగా మారుస్తోంది. అమెరికాను వణికిస్తున్న జైలజైన్ అనే డ్రగ్.. ఇప్పుడు భారత్లోకి కూడా ఏదో ఒక రూపంలో ప్రవేశిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి దీనిని పశువులకు మత్తు ఇవ్వడానికి వాడతారు. అయితే దీనిని ఇతర మత్తు పదార్థాలతో కలిపి తీసుకున్నప్పుడు మాత్రం.. మనిషి మెదడు పూర్తిగా మొద్దుబారిపోతుంది.
దీనివల్ల వారు చుట్టూ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో, బాడీపై కంట్రోల్ కోల్పోయి వింత వింత భంగిమల్లో రోడ్లపై కనిపించారు. దీంతో రెండు రోజులుగా ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదంతా చూస్తుంటే జాంబీ రెడ్డి సినిమాలో వైరస్ సోకిన వారు వింతగా ప్రవర్తించినట్లే ఉంది.
ఈ పరిస్థితులు కేవలం మత్తుకే పరిమితం కాకుండా భయంకరమైన బాడీలోని మార్పులకు కూడా దారి తీస్తున్నాయి. ఇలాంటి డ్రగ్స్ వాడటం వల్ల శరీరంలో బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయి, చర్మం లోపల నుంచి కుళ్లిపోవడం మొదలవుతుంది. అయితే మెల్లమెల్లగా మాంసం ఊడిపోయి ఎముకలు బయటపడతాయి. ఆ గాయాలు చూస్తుంటే మూవీల్లోని జాంబీలను చూసినట్లే భయం వేస్తుంది.
అయితే ఇండియాలో ఇలాంటి కేసులు పెరిగితే మాత్రం మన వైద్య వ్యవస్థకు అది పెద్ద సవాలుగా మారుతుంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ తగ్గించడానికి వాడే సాధారణ విరుగుడు మందులు కూడా వీటిపై సరిగ్గా పనిచేయవు. ఇది సొసైటీలో చాలా అభద్రతా భావానికి దారి తీస్తుంది.

మనం ఇప్పటికైనా మేల్కొనకపోతే జాంబీ రెడ్డి (Zombie Reddy ) వంటి సీన్లు కేవలం సినిమాలలోనే కాకుండా మన కళ్లముందే వాస్తవ ఘటనలుగా మారుతాయి. యూత్ను ఈ సింథటిక్ డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోవడం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్. దీనికి కుటుంబసభ్యులు, స్నేహితుల మద్దతు కూడా అవసరం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు, ఫోటోలు జాంబీ డ్రగ్ వల్ల వచ్చినవి కాకపోయినా, అలర్ట్గా ఉండటం మాత్రం చాలా ముఖ్యం. ఏది ఏమైనా, మనిషి తన విచక్షణను కోల్పోయి ఇలా వింతగా మారుతున్నాడంటే అది ప్రకృతి వైపరీత్యం కాదు, మనిషి సృష్టించుకున్న కృత్రిమ విషం అని గుర్తించాలి.
Strait of Hormuz:మళ్లీ హర్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయా?





