Gold Price:పసిడి ప్రియులకు మళ్లీ షాక్: ఒక్కరోజే భారీగా పెరిగిన పుత్తడి, వెండి ధరలు
Gold Price: పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుండటంతో డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో.. ధరలు ఆమాంతం ఎగబాకాయి.
Gold Price
కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు.. గురువారం ఒక్కసారిగా బ్రేక్ పడిపోయింది. రెండు, మూడు వారాలుగా పతనమవుతూ వస్తున్న పుత్తడి ధరలు, ఒక్కరోజే అది కూడా భారీగా పెరగడంతో కొనుగోలుదారులు షాక్ కు గురయ్యారు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన అనిశ్చితి, అమెరికా డాలర్ విలువలో మార్పులు, పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలకు(Gold Price) రెక్కలు తెచ్చాయి. దీనికి తోడు భారత దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుండటంతో డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో.. ధరలు ఆమాంతం ఎగబాకాయి.
హైదరాబాద్ మార్కెట్లో గురువారం 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ఏకంగా రూ.2,290 పెరిగి రూ.1,56,490కి చేరుకుంది. నిన్నటి వరకు రూ.1,54,200 వద్ద ఉన్న ఈ పసిడి ధర, ఇప్పుడు కొనుగోలుదారులకు భారీగానే భారాన్ని పెంచింది. అలాగే ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.2,100 పెరగడంతో.. ప్రస్తుతం రూ.1,43,450 వద్ద కొనసాగుతోంది.
కేవలం బంగారం ధరలు మాత్రమే కాకుండా, వెండి ధర కూడా చుక్కలు చూపిస్తుంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర ఒక్కరోజే ఏకంగా రూ.10,000 పెరిగిపోయి రూ.2.70 లక్షలకు చేరుకుంది. ఢిల్లీలో అయితే ఈ పెరుగుదల రూ.15,000 వరకు ఉంది.

గోల్డ్ ఒక్కసారిగా ఇంత పెరగడం వెనుక ముఖ్యంగా అంతర్జాతీయ కారణాలు బలంగానే ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై పాజిటివ్ సంకేతాలు ఇవ్వడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లించారు.
ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకోవడంతో పాటు, మరోవైపు ఐటీ, ఏఐ స్టాక్స్ లో కొంత అనిశ్చితి నెలకొంది. దీంతో సురక్షితమైన పెట్టుబడిగా అంతా బంగారం వైపు చూడటంతో..మరోసారి పసిడికి డిమాండ్ పెరిగింది.దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ తోడయింది. అయితే రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.



