Milk:మన పిల్లల గ్లాసుల్లో పోస్తుంది పాలా? విషమా? అమూల్,మదర్ డైరీ, కంట్రీ డిలైట్ పాలు ఎంత వరకూ సేఫ్?
Milk: మన పిల్లల గ్లాసుల్లో మనమే మన చేతులతో పాలు అనే పేరుతో వ్యాధులను కొనితెచ్చే లిక్విడ్ బ్యాక్టీరియాను రోజూ ఇస్తున్నామన్న మాట.
Milk
తల్లి పాల తర్వాత పిల్లలకు పట్టేది అంతా పట్టేది బయట దొరికే పాలే.పాలు(Milk) తాగితే మంచిదని చెబుతూ మన చేతులతోనే చిన్నారులకు తాగిస్తున్నాం. అలా మనమంతా అమృతం అనుకుంటున్న ఆ తెల్లటి పాలే..నిశ్శబ్దంగా మన పిల్లల పేగులను తెంచేస్తున్నాయన్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
అమూల్, మదర్ డైరీ, కంట్రీ డిలైట్ వంటి దిగ్గజ సంస్థల ప్యాకెట్ పాలు(Milk) ల్యాబ్ టెస్టుల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాయన్న నిజం బయటకు రావడంతో కోట్ల మంది తల్లుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ పాలలో కోలిఫార్మ్ అనే భయంకరమైన బ్యాక్టీరియా ఉండాల్సిన దానికంటే 98 రెట్లు ఉందన్న వాస్తవం ఎంతోమందిని షాక్కు గురి చేస్తుంది. కోలిఫార్మ్ బ్యాక్టీరియా అంటే మల విసర్జన వ్యర్థాల ద్వారా వచ్చే కాలుష్యం.. అంటే మన పిల్లల గ్లాసుల్లో మనమే మన చేతులతో పాలు అనే పేరుతో వ్యాధులను కొనితెచ్చే లిక్విడ్ బ్యాక్టీరియాను రోజూ ఇస్తున్నామన్న మాట.
అసలు ఇన్ని కోట్లు సంపాదిస్తున్న ఈ కంపెనీల పాలు.. ల్యాబ్ టెస్టుల్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే కారణం..సప్లై చైన్ లోపం. పాలు పితికే దగ్గర నుంచి తిరిగి ప్యాకెట్ల రూపంలో మన ఇంటికి చేరే వరకు ఎక్కడా సరైన శుభ్రత ఉండటం లేదు. గ్రామాల్లో పశువుల పేడతో నిండిన పరిసరాల్లోనే పాలు పితకడం, ఆ తర్వాత ఆ పాలను సరైన శీతలీకరణ (Refrigeration) లేని ట్యాంకర్లలో ఎండలో కంపెనీలకు తీసుకుని వెళ్లడం వల్ల బ్యాక్టీరియా కోట్ల సంఖ్యలో వృద్ధి చెందుతుంది.
పాశ్చరైజేషన్ చేసిన తర్వాత కూడా, ఆ తర్వాత ప్యాకింగ్ చేసే పైపులు మురికిగా ఉండటం వల్ల పాలు మళ్లీ పొల్యూట్ అవుతున్నాయి. చిత్రమైన విషయం ఏమిటంటే, అమూల్ కంపెనీదే అయిన టెట్రా ప్యాక్ (Tetra Pack) పాలు మాత్రం టెస్టులో పాస్ అయ్యాయి. ఎందుకంటే అవి ఆరు లేయర్ల ప్రొటెక్షన్తో గాలి కూడా చొరబడని విధంగా ప్యాక్ అవుతాయి. కానీ మనం తక్కువ ధరకి వస్తుందని కొనే ప్యాకెట్ పాలు మాత్రం బ్యాక్టీరియాకు నిలయాలుగా మారుతున్నాయి.
ఇలాంటి పాలు తాగడం వల్ల పిల్లలకు విరేచనాలే కాదు టైఫాయిడ్, కలరా వంటి జబ్బులు వచ్చే ప్రమాదముంది. ఐదేళ్ల లోపు పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారు చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతారు. భారత దేశంలో ఏటా లక్షలాది మంది పిల్లలు విరేచనాల వల్ల చనిపోతుంటే, అందులో 20 శాతం పసిపిల్లల మరణాలకు కారణం ఇలాంటి కలుషిత పాలేనని గణాంకాలే చెబుతున్నాయి.



ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్న వినిపిస్తోంది. తాజాగా ఫిబ్రవరి 10న ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) హడావిడిగా దాడులు ప్రారంభించి, కొన్ని ప్లాంట్లకు జరిమానాలు విధించినా.. ఇవన్నీ కంటితుడుపు చర్యలే అనిపిస్తోంది. చట్టాలు కఠినంగా లేకపోవడం,పెద్ద పెద్ద కంపెనీలకు రాజకీయ నాయకుల అండదండలు ఉండటం వల్ల ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది.
అందుకే ఇకపై ప్యాకెట్ పాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు టెట్రా ప్యాక్ పాలు వాడటమే మంచిది. ఒకవేళ ప్యాకెట్ పాలు వాడినా, కనీసం 15 నిమిషాల పాటు వాటిని బాగా మరిగించాలి. అలా మరిగించడం వల్ల 90 శాతం బ్యాక్టీరియా చనిపోయినా, పాలలోని పోషకాలు కూడా కొంతవరకు తగ్గిపోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అమూల్, మదర్ డైరీ వంటి డెయిరీలు స్టేట్మెంట్లు ఇవ్వడం ఆపి, తమ ప్యాకింగ్ యూనిట్లలో పరిశుభ్రతను పాటించేలా చేయాలి. ఎఫ్ఎస్ఎస్ఏఐ కేవలం దాడులకే పరిమితం కాకుండా, రియల్ టైం ల్యాబ్ టెస్టులను ప్రవేశపెడితేనే ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉంటాయి. అప్పటి వరకు మనమే మన పిల్లల ఆరోగ్యానికి కాపలాదారులుగా ఉండాలన్న సంగతి మర్చిపోకూడదు. .



