Nampally Forensic Lab : ప్రమాదమా..కుట్ర కోణమా ?..నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటనపై అనుమానాలు
Nampally Forensic Lab : నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్నిప్రమాదం:ఓటుకు నోటు కేసు కోసమేనా? అంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు
Nampally Forensic Lab
హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్(Nampally Forensic Lab) అగ్నిప్రమాద ఘటన ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రమాదం జరిగిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కీలకమైన కేసుల్లో సాక్ష్యాలను నాశనం చేసే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి తగలబెట్టించారంటూ ఆరోపించారు. ఒక క్రిమినల్ సీఎం అయితే ఇలాగే ఉంటుందంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ అగ్నిప్రమాద ఘటనపై మొదటి నుంచీ చాలా అనుమానాలు వస్తూనే ఉన్నాయి.
మొదటి అంతస్తులో మాత్రమే మంటలు చెలరేగడంపై అనుమానాలు నెలకొన్నాయి. రెండో అంతస్తులో ఫోరెన్సిక్ పరికరాలు, కెమికల్ ల్యాబ్ సామాగ్రి ఉన్నా కూడా మంటలు అక్కడకు వ్యాపించలేదు. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్ కు మొదటి అంతస్తు అత్యంత కీలకం. ప్రధాన కేసులకు సంబంధించిన అత్యంత కీలకమైన ఆధారాలు , ఇతర నివేదికలు ఇక్కడే భద్రపరుస్తారు. ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సీజ్ చేసిన హార్డ్డిస్కులు, కేసు రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్టు గుర్తించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన పలు కేసుల ఫైల్స్ దీనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు, వాటికి సంబంధించిన నివేదికలు సైతం కాలి బూడిదైనట్టు సమాచారం. అదే సమయంలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు మూడు గంటల సమయం పట్టడంపైనా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ దీనిపైనే ప్రధానంగా ఆరోపణలు చేశారు. కుట్రపూరితంగానే ఈ ఘటనకు పాల్పడ్డారనేది ఆయన ఆరోపణ.

షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందని నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్(Nampally Forensic Lab) డీజీ శిఖా గోయెల్ సైతం స్పష్టం చేశారు. పలువురు ఆరోపణలు చేస్తున్నట్టు కీలక కేసులకు సంబంధించిన కేసుల్లో ఆధారాలను ఇప్పటికే కోర్టులో సమర్పించామని ఆమె చెబుతున్నారు. కానీ ఏ కేసుల గురించే, ఏ ఆధారాలు అన్న అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులకు సంబంధించి ఆధారాలు చెరిపేసేందుకే ఈ ప్రమాదాన్ని సృష్టించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. మొత్తం మీద ఈ ప్రమాదం జరిగిన తీరుతో అనుమానాలు ఎక్కువగా, పోలీసుల దర్యాప్తు సరైన విధంగా సాగడం లేదన్న బీఆర్ఎస్ ఆరోపణలు రాజకీయంగా హీట్ పెంచాయి. ప్రస్తుతం అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఆధారాలు, ఇతర నివేదికలు పలు కీలక కేసుల్లో దర్యాప్తును కచ్చితంగా ప్రభావితం చేయబోతున్నాయి. వీటిలో కొన్ని కేసులు తీర్పు వెలువడేందుకు సమయం కూడా దగ్గర పడిన వేళ ఘటన జరగడంతో అనుమానాలు రెట్టింపయ్యాయి.



