Modi Pichai : భారత ఏఐ విప్లవం మొదలయినట్లేనా? మోదీ-పిచాయ్ భేటీ దీనికోసమేనా?
Modi Pichai :గూగుల్కు భారత్ లాంటి భారీ డేటా కలిగిన మార్కెట్ దొరుకుతుండగా, భారత్కు గూగుల్ వంటి గ్లోబల్ జెయింట్ నుంచి టెక్నాలజీ సహకారంతో పాటు పెట్టుబడులు అందుతున్నాయి.
Modi Pichai
ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 భారత ఐటీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోబోతోంది. ఈ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్(Modi Pichai)తో జరిపిన భేటీ.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీరు గతంలో 2015లో పిచాయ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, ప్రధాని అమెరికా పర్యటనల్లోనూ, అలాగే గూగుల్ తన కార్యకలాపాలను భారతదేశంలో విస్తరించిన ప్రతి సందర్భంలో కూడా వీరిద్దరూ కలుస్తూనే ఉన్నారు.
అయితే, ఈసారి మోదీ, పిచాయ్ (Modi Pichai) భేటీ మాత్రం ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణం..భారత్ కేవలం ఏఐని వినియోగించే దేశంగా కాకుండా, ఏఐని సృష్టించే దేశంగా (Global AI Hub) కూడా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకోవడమే. ఈ చర్చల్లో ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు గూగుల్ ద్వారా ఏఐ ట్రైనింగ్ ఇవ్వడం, దేశీయ భాషల్లో ఏఐ అప్లికేషన్లను డెవలప్ చేయడంపై దృష్టి సారిస్తున్నారు. దీనివల్ల గూగుల్కు భారత్ లాంటి భారీ డేటా కలిగిన మార్కెట్ దొరుకుతుండగా, భారత్కు గూగుల్ వంటి గ్లోబల్ జెయింట్ నుంచి టెక్నాలజీ సహకారంతో పాటు పెట్టుబడులు అందుతున్నాయి. ఇది సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే భారత్ నినాదానికి ఊతమిస్తుంది.
ఇప్పటి వరకూ గూగుల్ మనదేశంలో కేవలం సాఫ్ట్వేర్ సేవలను మాత్రమే అందించింది, కానీ ఇప్పుడు భారతీయ విద్యార్థులు, నిపుణులే గూగుల్ ఏఐని నడిపించాలి అనే సరికొత్త లక్ష్యంతో ఈ చర్చలు సాగాయి. సుందర్ పిచాయ్ భారతీయుడు కావడం, ఇక్కడి ప్రతిభపై పిచాయ్కు అపారమైన నమ్మకం ఉండటంతో, గూగుల్ తన ఏఐ ఇన్నోవేషన్ సెంటర్లను భారత దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించే అవకాశం కనిపిస్తోంది.

కేవలం గూగుల్ మాత్రమే కాకుండా, ఫిన్లాండ్ ప్రధాని , స్పెయిన్ అధ్యక్షుడితో జరిగిన చర్చలు భారత్ యొక్క మల్టీ-టెక్నాలజీ విజన్ను చాటుతున్నాయి. ఫిన్లాండ్తో 6జీ టెక్నాలజీతో పాటు క్లీన్ ఎనర్జీపై ఒప్పందాలు, స్పెయిన్తో రక్షణ , ఏఐ రంగాల్లో సహకారం భారత్ను గ్లోబల్ సప్లై చైన్లో టాప్లో నిలబెడతాయి. ప్రధాని మోదీ అంచనా వేసినట్లుగా, 2030 నాటికి భారత ఐటీ రంగం 400 బిలియన్ డాలర్లకు చేరుకోవాలంటే ఏఐ ఆధారిత అవుట్ సోర్సింగ్ కీలకమని అర్ధం అవుతోంది.
దీనివల్ల దేశంలోని లక్షలాది మంది ఇంజనీర్లు , స్టార్టప్ నిర్వాహకులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు తలుపు తడతాయి. 110 దేశాలు పాల్గొంటున్న ఈ సమ్మిట్ వల్ల భారత్ గ్లోబల్ సౌత్ దేశాలకు ఏఐ విషయంలో మార్గదర్శిగా నిలుస్తోంది. మొత్తంగా ఇప్పుడు జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కేవలం ఒక సాంకేతిక సదస్సు కాదు, ఇది ప్రపంచ దేశాల మధ్య భారత్ ఒక శక్తివంతమైన ఏఐ సూపర్ పవర్గా అవతరిస్తున్న సందర్భంగా నిలుస్తోంది.



