T20 World Cup : నెదర్లాండ్స్ పై ఆ స్టార్స్ కు రెస్ట్.. రిజర్వ్ ప్లేయర్స్ కు ఛాన్స్
T20 World Cup :టీమిండియా బుధవారం నెదర్లాండ్స్ తో చివరి లీగ్ మ్యాచ్ ఆడబోతోంది నేపథ్యంలో నెదర్లాండ్స్ పై పలువురికి విశ్రాంతినివ్వడం ఖాయమైంది. ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నారు.
T20 World Cup
టీ20 ప్రపంచకప్(T20 World Cup) లో పాకిస్థాన్ పై విజయంతో సూపర్ 8 బెర్త్ ఖరారు చేసుకున్న టీమిండియా బుధవారం నెదర్లాండ్స్ తో చివరి లీగ్ మ్యాచ్ ఆడబోతోంది. తర్వాతి రౌండ్ లో అన్నీ పెద్ద జట్లతోనే మ్యాచ్ లు ఉండనున్న నేపథ్యంలో నెదర్లాండ్స్ పై పలువురికి విశ్రాంతినివ్వడం ఖాయమైంది. ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నారు.
సూపర్ 8 మ్యాచ్ లకు ముందు కొంచెం రిలాక్స్ అయ్యేందుకు బుమ్రాకు ఇదే చక్కని అవకాశం. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా బుమ్రాకు విశ్రాంతినిచ్చి సిరాజ్ లేదా అర్షదీప్ లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. హర్షిత్ రాణా గాయంతో దూరమవడంతో జట్టులోకి వచ్చిన సిరాజ్ అమెరికాతో మ్యాచ్ లో అదరగొట్టాడు.
అప్పుడు బుమ్రా లేకపోవడంతో పేస్ ఎటాక్ ను లీడ్ చేసిన ఈ హైదరాబాదీ పేసర్ సత్తా చాటాడు. దీంతో నెదర్లాండ్స్ పై సిరాజ్ వైపే మేనేజ్ మెంట్ మొగ్గుచూపే ఛాన్సుంది. అటు అర్షదీప్ భారీగా పరుగులిచ్చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు భారత్ తన తర్వాతి మ్యాచ్ లన్నింటినీ స్వదేశంలోనే ఆడనుంది. దీంతో తుది జట్టులో కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కకపోవచ్చు. ఎందుకంటే చెన్నై, అహ్మదాబాద్ , కోల్ కత్తా వికెట్లన్నీ దాదాపుగా బ్యాటర్లకే అనుకూలంగా ఉండడం , స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్ , వరుణ్ చక్రవర్తిలనే కొనసాగించనున్నారు. దీంతో కుల్దీప్ బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది.

ఇక మిగిలిన జట్టులో రింకూ సింగ్ కు చోటు దక్కడంపై సందిగ్ఘత నెలకొంది. రింకూ పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు. అయితే రింకూను డ్రాప్ చేసి అదనపు బౌలర్ ను ఆడించే అవకాశాలనూ కొట్టిపారేయలేం. ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో కాస్త తడబాటును సరిచేసుకునేందుకు నెదర్లాండ్స్ తో మ్యాచ్ టీమిండియాకు మంచి అవకాశంగా చెప్పొచ్చు.
ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ డకౌటై నిరాశపరిచాడు. మళ్లీ మునుపటి ఫామ్ అందుకునేందుకు ఇంతకుమించిన అవకాశం దొరకదు. అలాగే భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు సూర్యకుమార్ యాదవ్ కూడా ఎదురుచూస్తున్నాడు. మొత్తం మీద సూపర్ 8 మ్యాచ్ కు ముందు రిజర్వ్ బెంచ్ ప్లేయర్స్ కు నెదర్లాండ్స్ పై చోటు దక్కనుంది.



