T20 World Cup : ముందుంది అసలు పరీక్ష … సూపర్-8లో భారత్ ప్రత్యర్థులు ఎవరంటే ?
T20 World Cup : టైటిల్ ఫేవరెట్స్ లో ముందున్న ఆతిథ్య భారత్ ఊహించినట్టుగానే హ్యాట్రిక్ విజయాలతో దుమ్మురేపింది.
T20 World Cup
టీ20 ప్రపంచకప్ మొదలై 10 రోజులు దాటిపోయింది. లీగ్ స్టేజ్ చివరి దశకు వచ్చేసింది. ఒకటి రెండు సంచలనాలు తప్పిస్తే దాదాపు చాలా మ్యాచ్ లలో ఫేవరెట్ జట్లే గెలిచాయి. చిన్న జట్లలో కొన్ని ఆకట్టుకున్నా పెద్ద జట్లే ముందంజ వేశాయి. టైటిల్ ఫేవరెట్స్ లో ముందున్న ఆతిథ్య భారత్ ఊహించినట్టుగానే హ్యాట్రిక్ విజయాలతో దుమ్మురేపింది.
పాక్ ను చిత్తు చేసి సగర్వంగా సూపర్-8 బెర్త్ ఖాయం చేసుకుంది. లీగ్ స్టేజ్ లో భారత్ గెలిచిన మ్యాచ్ లన్నీ దాదాపు ఏకపక్షంగానే ముగిసాయి. తొలి మ్యాచ్ లో యూఎస్ఎ మాత్రమే భారత్ ను కాస్త ఇబ్బంది పెట్టింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపులతో ఆ మ్యాచ్ లోనూ సెకండాఫ్ లో మన జట్టే ఆధిపత్యం కనబరిచింది.
ఇక అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన పాకిస్థాన్ మ్యాచ్ కూడా వన్ సైడ్ గానే ముగిసింది. అసలు పాక్ జట్టు ఏ దశలోనూ భారత్ కు పోటీ ఇవ్వలేదు. ఇప్పుడు సూపర్ 8 స్టేజ్ లో మాత్రం భారత్ కు అసలు సిసలు పోటీ ఎదురుకాబోతోంది. ఎందుకంటే అత్యుత్తమ జట్లే సూపర్ 8లో భారత్ గ్రూపులో వచ్చాయి.
లీగ్ స్టేజ్ లో తలపడిన జట్లు మళ్లీ సూపర్ 8లో ఎదురుపడకుండా ఐసీసీ షెడ్యూల్ ప్లాన్ చేసింది. అందుకే భారత్ గ్రూపులో సూపర్ 8 స్టేజ్ వరకూ చూస్తే వెస్టిండీస్ , సౌతాఫ్రికా జట్లు ఖరారయ్యాయి. మరో జట్టుగా జింబాబ్వే లేదా ఆస్ట్రేలియాలో ఒకటి రానుంది.
దీంతో భారత్ గ్రూప్ టఫ్ గా ఉండబోతోంది. టీ20(T20 World Cup)ల్లోనూ సత్తా చాటుతున్న సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. అందుకే సూపర్ 8 మ్యాచ్ లన్నీ హోరాహోరీగా సాగడం ఖాయం. సూపర్ 8లో భారత్ షెడ్యూల్ ను చూస్తే ఫిబ్రవరి 22న సౌతాఫ్రికాను ఢీకొంటుంది. తర్వాత ఫిబ్రవరి 26న జింబాబ్వే లేదా ఆసీస్ తో తలపడుతుంది.

మార్చి 1న వెస్టిండీస్ తో తలపడనున్న భారత్ కు సూపర్ 8 రౌండ్ ఖచ్చితంగా సవాల్ గానే చెప్పాలి. సొంతగడ్డపై ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా టైటిల్ నిలబెట్టుకోావాలనుకుంటున్న భారత్ కు విండీస్ , సఫారీల రూపంలో కఠిన సవాళ్లు ఎదురుచూస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సారి మెగాటోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూపుకు 5 జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు.
ప్రతీ గ్రూప్ లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్ 8కు క్వాలిఫై అయ్యాయి. ఈ 8 జట్లను మళ్లీ రెండు గ్రూపులుగా విభజించి మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడిస్తారు. ఈ మూడు మ్యాచ్ల తర్వాత గ్రూప్స్ నుంచి సెమీస్ తర్వాత ఫైనల్ ఉంటుంది.



