Tirumala :ఇక డిజిటల్ రూపంలో తిరుమల శ్రీవారికి కానుకలు ..ఎందుకీ నిర్ణయం?
Tirumala : భక్తుల సౌకర్యం కోసమే కాకుండా, పరకామణిలో హుండీ లెక్కింపు ప్రక్రియను మరింత ఈజీగా చేయడానికి ఉపయోగపడుతుంది.
Tirumala
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమల(Tirumala ) శ్రీవారి భక్తులకు ఒక కీలకమైన వార్త అందించింది. మారుతున్న కాలానికి తగినట్లుగా, ప్రతి చిన్న లావాదేవీ కూడా ఇప్పుడు డిజిటల్ రూపంలో జరుగుతుండటంతో.. శ్రీవారికి సమర్పించే ముడుపులను కూడా క్యాష్ లెస్గా స్వీకరించాలని టీటీడీ ఆలోచిస్తోంది.
సాధారణంగా భక్తులు తమ మొక్కుల ప్రకారం హుండీలో డబ్బుల రూపంలో కానుకలు సమర్పిస్తుంటారు. అయితే ఇకపై యూపీఐ, క్రెడిట్ , డెబిట్ కార్డుల ద్వారా కూడా ముడుపులు చెల్లించడానికి సరికొత్త ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనివల్ల భక్తులకు క్యాష్ చేతితో పట్టుకురావాల్సిన అవసరం ఉండదు. అలాగే పారదర్శకత కూడా పెరుగుతుందని టీటీడీ బోర్డు భావిస్తోంది. ఈ నెల 28న జరగబోయే పాలకమండలి సమావేశంలో ఈ డిజిటల్ ముడుపుల విధానంపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ కొత్త విధానం ప్రకారం తిరుమల(Tirumala )లోని స్పెషల్ కౌంటర్లలో భక్తులు డిజిటల్ పద్ధతిలో డబ్బులను చెల్లిస్తే, టీటీడీ తరపున వారికి ఒక శ్రీవారి ముడుపు పత్రం అందజేస్తారు. భక్తులు ఆ పత్రాన్ని తీసుకెళ్లి హుండీలో సమర్పించొచ్చు. ఇది కేవలం భక్తుల సౌకర్యం కోసమే కాకుండా, పరకామణిలో హుండీ లెక్కింపు ప్రక్రియను మరింత ఈజీగా చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇక 2025 సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా సుమారు 1383 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఈ భారీ ఆదాయాన్ని మరింత సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించడానికి వంద రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా డిజిటల్ పేమెంట్స్ చేసే వెసులుబాటును టీటీడీ కల్పిస్తోంది. ఇది భక్తులకు ఒక వినూత్నమైన అనుభూతిని అందించడంతో పాటు, క్యాష్ లెస్ ట్రాన్జాక్షన్స్ దిశగా టీటీడీ వేస్తున్న మరో పెద్ద అడుగు అనే చెప్పాలి.



