TTD:శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక..
TTD: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, సేవా టికెట్లు , గదుల బుకింగ్ కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ మాత్రమే ఉపయోగించాలని అధికారులు స్పష్టం చేశారు
TTD
తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల కోసం ఆన్లైన్లో బుక్ చేసుకునే భక్తులు ఇకపైన అయినా అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజిలెన్స్ విభాగం హెచ్చరించింది. భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని నకిలీ వెబ్సైట్లతో పాటు దళారులు భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లు టీటీడీ (TTD)అధికారులు గుర్తించారు.
ఇటీవల కేరళకు చెందిన ఒక భక్తుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకున్నాడు. అయితే గదుల బుకింగ్ పేరుతో దళారి చేతిలో ఆ భక్తుడు మోసపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
గూగుల్ సెర్చ్లో అచ్చంగా టీటీడీ అధికారిక వెబ్సైట్లాగే కనిపించేలా నకిలీ పోర్టల్స్ క్రియేట్ చేసి, భక్తుల నుంచి ఆన్లైన్ పేమెంట్లు వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఇలాంటి నకిలీ వెబ్సైట్లపై టీటీడీ ఐటీ విభాగం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు..కాపీరైట్ చట్టం కింద కేసులు కూడా నమోదు చేసింది.

ఇకపై తిరుమల రావాలనుకునే భక్తులు.. శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, సేవా టికెట్లు , గదుల బుకింగ్ కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ మాత్రమే ఉపయోగించాలని టీటీడీ (TTD)అధికారులు స్పష్టం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి గదులు ఇప్పిస్తామని చెబితే నమ్మొద్దని, అలాగే సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను అసలే క్లిక్ చేయవద్దని సూచించారు.
అంతేకాదు ఏదైనా అనుమానాస్పద వెబ్సైట్, లేదా ఫోన్ కాల్ వస్తే వెంటనే ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ దృష్టికి తీసుకురావాలని కోరారు. భక్తులు తమ వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంక్ వివరాలను అపరిచిత వెబ్సైట్లలో నమోదు చేయొద్దని సూచించారు.



